అధికారంలోకి వస్తే కుమ్మరలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం
గుమ్మేపల్లిలో 400 కిలోమీటర్ల మైలురాయిని చేరిన ప్రజా సంకల్ప యాత్ర
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగుతున్న జగన్
‘కుమ్మరుల కష్టాలేంటో నాకు తెలుసు. బీసీల పరిస్థితి ఎలా ఉందో, వారి సంక్షేమంపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో కూడా తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ. దేవుడి దయతో మనం అధికారంలోకి రాగానే కుమ్మరలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా’ అని విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నాలుగో రోజు పాదయాత్రలో భాగంగా గుమ్మేపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన కుమ్మర సంఘం నేతలతో జగన్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ భరోసా
సాక్షి ప్రతినిధి, అనంతపురం:
ప్రజా సంకల్ప యాత్ర నాలుగో రోజు(29వ రోజు) గురువారం కల్లుమడి శివారు నుంచి మొదలైంది. ఉదయం 8.30 టలకు వైఎస్ జగన్ యాత్ర ప్రారంభించారు. నవరత్నాల పథకాలతో ప్రత్యేకంగా తయారు తయారు చేసిన చీరలను ధరించిన మహిళలు జగన్కు ఎదురొచ్చారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుంచి కల్లుమడి చేరుకున్నారు. కల్లుమడిలో గ్రామస్తులు రోడ్డు పొడవునా పూలు పరచి స్వాగతం పలికారు. అక్కడే పార్టీ జెండా ఆవిష్కరించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలను జగన్ పలకరించారు. మహిళలు హారతి ఇచ్చి దిష్టి తీశారు. నుదుట కుంకుమతో బొట్టు పెట్టి దీవిం చారు. ఎల్లమ్మ అనే మహిళ జగన్ను కలసి.. ‘నా భర్త చనిపోయాడు. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదు. ఇదే విషయమై అడిగితే భర్తను తీసుకు రాపో’ అని డీలర్ చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుండి గుమ్మేపల్లికి యాత్ర మొదలైంది. దారిలో పత్తి రైతులు, కూలీలు జగన్ను కలిశారు.
పత్తికి గిట్టుబాటు ధర లేదని, నకిలీ విత్తనాలతో మోసపోతున్నామని వాపోయారు. దానిమ్మ తోట రైతులు జగన్ను కలిశారు. కుమ్మర సంఘం నేతలు చట్రంతో వచ్చి జగన్ను కలిశారు. కుండను తయారు చేసేందుకు మట్టిని ఏర్పాటు చేస్తే జగన్ చట్రం తిప్పారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. ఎమ్మార్పీఎస్ నేతలు జగన్ను కలసి ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరారు. ఆపై విద్యుత్ ఎంప్లాయీస్ ప్రతినిధులు సైతం కలిశారు. ఇలా దారిపొడవునా సమస్యలు వింటూ జగన్ ముందుకు సాగారు. శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాంబశివారెడ్డి తమ నియోజకవర్గంలోని కార్యకర్తలను అధ్యక్షుడిని పరిచయం చేశారు.
400 కిలోమీటర్లకు చేరుకున్న యాత్ర
ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్ప యాత్ర గుమ్మేపల్లికి రాకతో 400 కిలో మీటర్లకు చేరింది. అక్కడ గుర్తుగా ఓ వేప మొక్కను నాటి నీళ్లు పోశారు. తర్వాత వైఎస్సార్ విగ్రహాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామస్తులు జగన్పై పూలవర్షం కురిపించారు. యాత్ర గార్లదిన్నె మండలం పాపినేనిపాళ్యం శివారు వరకూ కొనసాగింది. అక్కడితో యాత్రను జగన్ ముగించారు. నాలుగో రోజు 11.4 కిలోమీటర్లు నడిచారు. దీంతో జిల్లాలో యాత్ర మొత్తం 51.5 కిలోమీటర్లు పూర్తయింది. యాత్రలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్రకార్యదర్శి వై.మధుసూదన్రెడ్డి, అనంత చంద్రారెడ్డి, సాంస్కృతిక విభాగం, బీసీ సెల్, ఎస్సీ సెల్, జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, వీరాంజనేయులు, పెన్నోబులేసు, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షుడు తరిమెల శరత్చంద్రారెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం, కార్పొరేటర్లు బాలాంజనేయులు, బోయ గిరిజ, వైఎస్సార్సీపీ నేతలు వైటీ శివారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి, గోపాల్మోహన్, ఆకులేడు రామచంద్రారెడ్డి, వలిపిరెడ్డి శివారెడ్డి, యూపీ నాగిరెడ్డి, మహిళా విభాగం నేతలు దేవి, కృష్ణవేణి, మునీరా తదితరులు పాల్గొన్నారు.