అవినీతి అనకొండ చంద్రబాబు

8 Sep, 2017 02:49 IST|Sakshi

నగరపాలక సంస్థలో అవినీతి కనపడడం లేదా?
మేయర్‌ భర్త ఆరోపణలు వినపడలేదా?
♦  జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం


సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి అనకొండ అయిన సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు, అధికారులు చేస్తున్న అవినీతి కనపడడం లేదని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆమె  ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని మేయర్‌ భర్త, టీడీపీ నేత పంతం కొండలరావు విలేకర్ల సమావేశంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినా సీఎంకు వినపడలేదా? పత్రికల్లో కనపడలేదా? అని ప్రశ్నించారు.

పైగా అవినీతిని సహించబోమని, ఎవరైనా అధికారులు పని చేయడానికి డబ్బులు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇసుకపై ఎవరి పెత్తనం సహించనంటూ ఒకవైపు కల్లబొల్లి మాటలు చెబుతూనే.. రాష్ట్ర వ్యాప్తంగా తన పుత్రరత్నంతో అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక మాఫియా నుంచి రోజువారీ మామూళ్లు వసూలు చేయిస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లలో నగరపాలక సంస్థ నగరంలో ఏం అభివృద్ధి చేసిందని మేయర్‌ భర్త ప్రశ్నించారని, దానికి స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు