ఈ నెల 21న అప్పుల ఊబిలో ఏపీ సదస్సు : జనచైతన్య వేదిక

18 May, 2019 12:40 IST|Sakshi

సాక్షి, గుంటూరు : రాబోయే నూతన ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్‌ అప్పుల భారమే అని  జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెడ్డి విమర్శించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఏపీ చేసిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రానికి అప్పు రూ. 90 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ.3.5 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. చేసిన అప్పులు తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.

పుష్కరాల పేరుతో రూ. 3200 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో కనీసం రూ. 300 కోట్ల పని కూడా జరగలేదన్నారు. పోలవరం ఎర్త్‌ డ్యాం ఒక్కశాతం కూడా పూర్తి కాలేదని లక్ష్మణ్‌ రెడ్డి ఆరోపించారు. దుబారా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందన్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బులన్ని చంద్రబాబు దీక్షలకు, విదేశీ పర్యటనలకు, దుబారా ఖర్చులకే సరిపోయాయని విమర్శించారు.  అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌ అనే అంశంపై ఈనెల 21వ తేదీన గుంటూరులో మేధావులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది

మరిన్ని వార్తలు