మూడు రాజధానులకే మద్దతు

27 Feb, 2020 09:45 IST|Sakshi

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌

సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు. విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌, తాను ఈ మధ్య కాలంలో కలవలేదని.. ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను..దగ్గరగా లేను.. జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుపుతానని ముందే చెప్పానని ఎమ్మెల్యే రాపాక పేర్కొన్నారు.

చంద్రబాబు రాక్షస పాలన చేశారు: నారాయణ స్వామి
సీఎం వైఎస్‌ జగన్ నవరత్నాలను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా ముందుకు తీసుకెళ్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దశలవారీగా మద్యపాన నిషేధంతో పాటు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో రాక్షస పాలన చేశారని విమర్శించారు. ప్రజలు విసిగి రామరాజ్యం కావాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేశారని పేర్కొన్నారు. కూలి చేసే కార్మికులను మద్యానికి బానిసలుగా చేస్తూ తాగుబోతు సంఘానికి అధ్యక్షుడి చంద్రబాబు తయారయ్యారని నారాయణ స్వామి  ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు