స్వైన్‌ఫ్లూనే..!

10 Dec, 2018 12:43 IST|Sakshi
సికింద్రాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్న జూలూరు వెంకటరమణ కిరణ్‌కుమార్‌ వెంకట రమణ కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారైన ల్యాబ్‌ నివేదిక

జంగారెడ్డి కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ నిర్ధారణ

వాస్తవాలు మభ్యపెట్టే ప్రయత్నంలో వైద్యాధికారులు

ఇంకా వైద్య పరీక్షల నివేదికలు రాలేదని వివరణ

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వైన్‌ప్లూ కలకలం రేగినప్పటికీ స్వైన్‌ప్లూతో ఒక రోగి సికింద్రాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వైద్యశాఖ అధికారులు మాత్రం దీనిని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు. స్థానిక శిఖామణి చర్చి వద్ద నివశిస్తోన్న పెట్‌షాప్‌ నిర్వాహకులు జూలూరు వెంకట రమణ కిరణకుమార్‌కు స్వైన్‌ఫ్లూ సోకింది. దీంతో జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఆసుపత్రుల్లో పలు వైద్యరీక్షలు నిర్వహించి రోగి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని సికింద్రాబాద్‌ తరలించారు. సికింద్రాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కిరణ్‌కుమార్‌కు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతనికి స్వైన్‌ప్లూ వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకిందని “సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం పీహెచ్‌సీ సిబ్బందిని కిరణ్‌కుమార్‌ వైద్య పరీక్షలు నివేదిక తీసుకువచ్చేందుకు సికింద్రాబాద్‌ పంపారు. అయితే తమకింకా కిరణ్‌కుమార్‌కు సంబంధించి వైద్యపరీక్షల నివేదికలు రాలేదని వైద్యాధికారులు చెప్పుకొస్తున్నారు. కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకలేదని, ఇన్‌ప్లూయేంజాతో బాధపడుతున్నారని మభ్యపెడుతూ  వచ్చారు. అయితే కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకడమే కాకుండా అతనికి ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిని అపస్మారక స్థితిలో సికింద్రాబాద్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. కిరణ్‌కుమార్‌ వైద్యానికి సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. అయినా వైద్యాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. కిరణ్‌కుమార్‌కు చెందిన వైద్య పరీక్ష నివేదికలు కూడా తమకు ఇంకా అందలేదని చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ
జూలూరి వెంకట రమణ కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకినట్లు సికింద్రాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 5వ తేదీనే అక్కడి వైద్యులు కిరణ్‌కుమార్‌కు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదిక సాక్షి సేకరించింది. ఆ నివేదికలో కిరణ్‌కుమార్‌కు ఇన్‌ప్లూయేంజా ఏ/హెచ్‌1–2009 ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే ఇన్‌ప్లూయేంజా–ఎ వైరస్‌ ఉన్నట్‌లైతే రోగికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇప్పటికైనా వైద్యాధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని స్వైన్‌ప్లూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. స్వైన్‌ప్లూ లేదని చెప్పే వైద్యులు దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కిరణ్‌కుమార్‌ వైద్యంపై వైద్యశాఖ జోక్యం చేసుకుని మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు