సంక్రాంతి సందర్భంగా 54 జనసాధారణ రైళ్లు

10 Jan, 2019 14:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో వందకు పైగా అదనపు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనల మేరకు 54 జనసాధారణ రైళ్లను అధికారులు పెంచారు. సికింద్రాబాద్‌–విజయవాడ, సికింద్రాబాద్‌–తిరుపతి, తిరుపతి–కాకినాడ, విజయవాడ–విజయనగరం, విజయవాడ–హైదరాబాద్, తదితర మార్గాల్లో జనసాధారణ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌–విజయవాడ (07192/07193) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో మధ్యాహ్నం 12 కు బయలుదేరి అదేరోజు సాయంత్రం 7.30 కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 8. 25 కు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.20 కి సికింద్రాబాద్‌కు, ఉదయం 3 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–విజయవాడ (07194/07195) మరో జనసాధారణ రైలు కూడా ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు (14న మినహా) ప్రతిరోజు రాత్రి 11.30 గంటలకి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12 నుంచి 20 వరకు ప్రతిరోజు ఉదయం 8.35కు విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–తిరుపతి (07188/07189) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 11న సాయంత్రం 7.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5.20 కి తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

తిరుపతి–కాకినాడ (07190/07191) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 12న రాత్రి 9.50 కి తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13న సాయంత్రం 6.45 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 కు తిరుపతికి చేరుకుంటుంది. విజయవాడ–విజయనగరం (07184/07185) స్పెషల్‌ ట్రైన్‌ 11న నుంచి 13వ తేదీ వరకు మూడ్రోజుల పాటు రాత్రి 9.10 కి విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 కి విజయనగరం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 11 నుంచి 14 వరకు 4 రోజుల పాటు ఉదయం 7.45 కు విజయనగరం నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 4.30 కు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ–విజయనగరం (07186/07187) మరో జనసాధారణ రైలు ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో మధ్యాహ్నం 12.30 కి విజయవాడ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 9.30కు విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే తేదీల్లో రాత్రి 10.55 కు విజయనగరం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 కు విజయవాడ చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు