నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!

13 Jul, 2020 17:41 IST|Sakshi

సాక్షి, అనంతపురం :  జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. కస్టడీలో వారు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి నేర అంగీకారపత్రం.. ‘సాక్షి’ చేతికి చిక్కింది. అందులో ఏముదంటే.. స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం  ప్రభాకర్‌రెడ్డి చెన్నైకి చెందిన ముత్తుకుమార్‌ను సంప్రదించారు. నాగాలాండ్‌ ఆర్టీఏ బ్రోకర్‌ సంజయ్‌ ద్వారా వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్‌కు తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం 154 వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయించారు.(మాకేం తెలీదప్పా..అంతా బ్రోకర్లే జేసినారు..)

ఇలా బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా నమోదు చేయించారు. ఇందుకోసం ముత్తుకుమార్‌, సంజయ్‌లకు ప్రభాకర్‌రెడ్డిలకు భారీగా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత జేసీ అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్‌ఓసీ తీసకున్నారు.  ఈ మేరకు జేసీ ప్రభాకర్‌ నేరం అంగీకరించారు. ఇలా ఫోర్జరీ చేసిన పత్రాలతో తెలంగాణ, కర్ణాటకలలో 8 వోల్వో బస్సులు, లారీలు విక్రయించారు. మొత్తం అశోక్‌ లేలాండ్‌కు చెందిన 154 వాహనాలను స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి.. వాటిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు మార్చిన తీరు విస్మయం కలిగిస్తోంది.(మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్‌)

ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ..
జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. వారి బెయిల్‌ పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టారు. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఆయన.. వారి రిమాండ్‌ను ఈ నెల 27 దాకా పొడిగించారు. కాగా, ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు కడప సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. 

>
మరిన్ని వార్తలు