జేసీ రేఖారాణి బదిలీ

8 Jan, 2015 02:15 IST|Sakshi
జేసీ రేఖారాణి బదిలీ

నెల్లూరు(రెవెన్యూ): జేసీ రేఖారాణి బదిలీ అయ్యారు. ఆమెకు ఇంకా ఏ జిల్లా కేటాయించలేదు. నూతన జాయింట్ కలెక్టర్‌గా మహ్మద్ ఇంతియాజ్‌ను నియమిస్తు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతియాజ్ గతంలో జిల్లాలో సీటీఓగా విధులు నిర్వహించారు. ఐఏఎస్ హోదా వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికల సమయంలో ట్రైనీ కలెక్టర్‌గా జిల్లాలో పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయనకు 2013లో ఐఏఎస్ హోదా కల్పించారు. డిప్యూటీ కలెక్టర్‌గా, సీటీఓగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. గురువారం ఆయన జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
 
ప్రత్యేకతను చాటుకున్న రేఖారాణి

2014 ఫిబ్రవరి 19న రేఖారాణి జేసీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 11 నెలలలు పనిచేశారు. తనదైనశైలిలో రేఖారాణి విధులు నిర్వహించారు. ఎవరి మాటా వినకుండా తను అనుకున్న పనినే చేసే మనస్తత్వం ఆమెది. క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్‌ను జిల్లాకు తీసుకువచ్చి జిల్లా కిర్తీని దేశానికి చాటారు. రేఖారాణి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఎంపీలందరూ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను గతంలోకంటే మిన్నగా నిర్వహించేలా రంగం సిద్ధం చేశారు.

పక్షుల పండగకు సంబంధించి విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించారు. కార్తీకమాసంలో మైపాడు తీరంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేత సంగీతవిభావరి ఏర్పాటు చేశారు. ఓటుహక్కు వినియోగించుకో.. బంగారం పట్టుకో అని ప్రచారం చేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారి జాబితా సిద్ధం చేసి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు బంగారం అందజేశారు. జిల్లాలో పనిచేయడం తనకు సంతృప్తిని ఇచ్చిందని రేఖారాణి సాక్షితో తెలిపారు.

మరిన్ని వార్తలు