సినీ నటి జియా శర్మ ఎంజీ ఆస్పత్రిలో‘క్యాన్సర్ రోజ్ డే’
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందని ప్రముఖ సినీనటి జియాశర్మ అన్నారు. ఎంవీపీ కాలనీలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన క్యాన్సర్ రోజ్ డే వేడుకలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు ఆధునాతన చికిత్స అందించడంతో పాటు రోగికి ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆహారపు అలవాట్లు విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరముందన్నారు. హాస్పటల్లోని పలువురు రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆమె వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్పటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఠాకూర్ రోగులకు అందిస్తున్న అత్యాధునిక వైద్య సౌకర్యాన్ని జియా శర్మకు వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సీతారామ పాల్గొన్నారు.