అజ్ఞానధార

15 Dec, 2018 08:49 IST|Sakshi
జ్ఞానధార పరీక్ష నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు(ఫైల్‌)

నిర్వహణపై ప్రభుత్వం నుంచి∙ స్పష్టత కరువు

గందరగోళంలో విద్యా వ్యవస్థ

నిలిచిపోయిన బేసిలైన్‌ టెస్ట్‌ ఫలితాలు

వెనుకబడిన విద్యార్థులను గుర్తించని వైనం

శ్రీకాకుళం, వీరఘట్టం: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహించాల్సిన జ్ఞానధార కార్యక్రమంపై ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. పైగా అక్టోబర్‌ 31న రూ.60 లక్షలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బేస్‌లైన్‌ టెస్ట్‌ ఫలితాలు 40 రోజులు దాటుతున్నా విడుదల చేయలేదు. మరోవైపు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాల్సి ఉంటోంది. ఈ విధమైన పని భారంతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు.

ఇది ఉద్దేశం...
జ్ఞానధార నిరంతర ప్రక్రియ. సర్కారు బడుల్లో తరగతుల వారీగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఉన్నత పాఠశాలల్లో 8 పిరియడ్స్‌ ఉంటాయి. ఉదయం 4 పిరియడ్స్, మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం వరకు 4 పిరియడ్స్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కో పిరియడ్‌లో 45 నిముషాలపాటు పాఠాలు బోధిస్తుంటారు. వీటిని 40 నిముషాలకు కుదించి, సాయంత్రం 9వ పిరియడ్‌గా 40 నిముషాల పాటు జ్ఞానధార కార్యక్రమానికి కేటాయించారు. బేస్‌లైన్‌ టెస్ట్‌లో ఎంపికైన వెనుకబడిన విద్యార్థులకు ఈ పిరియడ్‌లో ప్రత్యేకంగా బోధించాలి. దీనికోసం ప్రతీ విద్యార్థికి ప్రత్యేక పుస్తకాలు ఇవ్వాలి. నేటి వరకు స్పష్టత లేకపోవడంతో ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

విద్యా సంవత్సరం మొదట్లోనే...
వాస్తవానికి విద్యార్థులకు బేసిలైన్‌ టెస్ట్‌ను విద్యా సంవత్సరం ప్రారంభంలో అంటే జూన్‌ లేదా జూ లైలో నిర్వహించాలి. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు తర్వాత అక్టోబర్‌ 31న బేస్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించారు. జిల్లాలో 6, 7, 8 తర గతులు విద్యార్థులు 80,899 మంది ఈ పరీక్ష రాశారు. ఫలితాలు మాత్రం నేటికీ విడుదల చేయలేదు.

ఎప్పుడు నిర్వహిస్తారో...
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి సర్కారు బడులను బలోపేతం చేయడమే తమ లక్షమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం గతేడాది అమలు చేసిన జ్ఞానధార కార్యక్రమం నీరుగారిపోతోంది. గతేడాది తప్పిదాలు పునరావృతం కాకుండా ఈ ఏడాది పక్కాగా నిర్వహించాలని తలపెట్టిన ఈ కార్యక్రమంపై స్పష్టత కొరవడింది. ఇప్పటికే పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, వీడియో కాన్ఫరెన్స్‌ ఇలా ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జ్ఞానధార కార్యక్రమం ఇప్పుడు నిర్వహించినా సత్ఫలితాలు రావడం కష్టమని అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.

ప్రచార ఆర్భాటానికే...
బేస్‌లైన్‌ పరీక్ష ఫలితాలను ఆయా హెచ్‌ఎంలు ఆన్‌లైన్లో పొందుపరిచారు. ఈ ఫలితాల్లో ఎవరిని వెనుకబడిన విద్యార్థులుగా గుర్తించాలో విద్యా శాఖ వద్ద స్పష్టత కొరవడింది. ప్రభుత్వం నిర్ణ యం మేరకు 35 శాతం మార్కులు వచ్చినవారా? అంత కంటే తక్కువ వచ్చిన వారినీ గుర్తించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక పుస్తకాలు ముద్రించినట్టు విద్యాశాఖ చెబుతోంది. భారీగా నిధులు ఖర్చు చేస్తూ ప్రచార ఆర్భాటం కోసమే ఇదంతా చేస్తున్నట్లు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

సర్కారు బడులు నిర్వీర్యమయ్యాయి
టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సర్కారు బడులను నిర్వీర్యం చేసింది. విద్యా సంవత్సర ప్రారంభంలో చేపట్టాల్సిన జ్ఞానధార చివర్లో నిర్వహించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. రూ.కోట్ల ఖర్చు చేయడానికే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఏడాది పాఠశాల మెయింటినెన్స్‌ నిధులు విడుదల చేయకపోవడంతో సుద్దముక్కలు కొనడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఇలా ప్రభుత్వ తీరు ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.విశ్వాసరాయి కళావతి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు