సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని అసహ్యించుకున్నారని, అందుకే ఓడించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గ్రహించాలని సూచించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పింది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ నేతలలో, నాయకుడిలో మార్పు రావాలని, లేకుంటే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23నుంచి 13కి తగ్గిపోతుందన్నారు. టీడీపీ సభ్యులను చూస్తే పరమానందయ్య శిష్యులు గుర్తుకువస్తారంటూ ఎద్దేవా చేశారు. కేబినేట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం చోటు కల్పించిన ఘనత వైఎస్ జగన్దేనని కొనియాడారు.
పేదవాడి గుండె తట్టి.. ప్రతి ఇంటి గడప తొక్కి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేద వారికి మేలు జరిగిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వాఖ్యానించారు. పేదవాడి గుండె తట్టి.. ప్రతి ఇంటి గడప తొక్కి వారికి మేలు చేశారని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేదవారికి ఏం మేలు చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. సుస్థిరమైన, సుపరిపాలనను వైఎస్సార్ అందించారని తెలిపారు.