'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'

18 Aug, 2017 02:37 IST|Sakshi
'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'

నంద్యాల వ్యవసాయం:  రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఎస్సీ, ఎస్టీలు  అసహ్యించుకుంటారని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

గురువారం నంద్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి హోదాలో ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని చెప్పిన మంత్రి,  క్షమాపణలు చెప్పకుండా, అలా అనలేదని తప్పించుకోవడం సిగ్గు చేటరన్నారు. సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్‌ ఆఫీసర్లలో ఎస్సీలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌.. ఎస్సీ, ఎస్టీలపైన అభిమానం, ప్రేమానురాగాలు చూపించేవారన్నారు. నంద్యాల  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలి పించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు. సమావేశంలో సింగనమల నాయకురాలు బండి లలితా కల్యాణి, బ్యాళ్ల శీను పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు