చంద్రబాబుపై పిల్‌.. ముగిసిన విచారణ

28 May, 2020 16:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం చివరకు తీర్పును వెలువరించింది. కరోనా వైరస్‌ కట్డడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. (లాక్‌డౌన్‌ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్‌)

నేరుగా పిల్ వేయటం మూలంగా వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాగే నిబంధనల ఉల్లంఘనలపై  చట్టం ప్రకారం సంబంధిత శాఖలో ఫిర్యాదు చేసేందుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్‌..)


 

>
మరిన్ని వార్తలు