చిత్రహింసలు పెడుతున్న భర్త
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా దాడి
సాక్షి, మదనపల్లె క్రైం : పెళ్లయిన ఆరు నెలలకే ఓ యువతిని తన భర్త చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. బాధలు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో స్టేషన్ వద్దే దాడి చేశాడు. గాయపడిన ఆమెను బాధితురాలి కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుతోంది. వివరాలు .. బి.కొత్తకోట బి.సి కాలనీలో కాపురం ఉంటున్న సోనియా(20) అదే కాలనీకి చెందిన ముబారక్ను ఆరు నెలల కిందట రెండో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో ముబారక్ మొదటి భార్య జబీనా సోనియాపై కక్షపెంచుకుని వేధిపులకు పాల్పడటం ప్రారంభించింది. భర్తకు లేనిపోనివి నూరిపోసి ఇద్దరు చిత్రహింసలకు గురిచేసి దాడి చేసింది. విసిగి పోయిన సోనియా బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. గమనించిన భర్త, మొదటి భార్యలు కలసి స్టేషన్ వద్దే సోనియాపై దాడిచేసి చితక బాదారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆమె తల్లి గౌషియా చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.