హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బోసలే

7 May, 2015 19:21 IST|Sakshi
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బోసలే

హైదరాబాద్:ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసలే నియమితులయ్యారు.  ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌ గుప్తా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో బోసలేను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.  దీనికి తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడంతో బోసలే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

 

బార్ కౌన్సిల్ సభ్యుల్లో పిన్న వయస్కుడు


 జస్టిస్ బోసలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాబాసాహెబ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బోసలే విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసుల్లో అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బాంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన బాంబే హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు ఈయనే.

వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2001, జనవరి 22న బాంబే హైకోర్టు అదనపు న్యాయవాదిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న  ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు