సాక్షి; అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు అన్నారు. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్గా శనివారం సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చి, దీన్ని అమలు చేయడానికి ఒక న్యాయమూర్తిని నియమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా ఈ తరహా విధానం ఎక్కడా లేదని వెల్లడించారు. లోకకళ్యాణం కోసం మనమంతా జీవించాలని, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. హక్కుల కోసం పోరాడేవారు బాధ్యతగా ఉండాలని.. కర్మబద్దంగా.. ధర్మబద్దంగా అందరూ పని చేయాలని ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జస్టిస్ శివశంకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం జగన్ను కలిసిన లక్ష్మణ్రెడ్డి
తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.