ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ ఈశ్వరయ్య

13 Sep, 2019 04:39 IST|Sakshi

త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచ డంతో పాటు మౌలిక సదుపా యాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన మీదట, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఈశ్వరయ్యను కమిషన్‌ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్‌ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్‌కు సీఈవోగా వ్యవహరిస్తారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టారు. దీనికి అనుగుణంగానే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కమిషన్‌ పరిధిలోకి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీలు వస్తాయి. ప్రవేశాలు, ఫీజులు, బోధన, పరీక్షలు, పరిశోధన, సిబ్బంది అర్హతలు, నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలన్నిటినీ ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు ఆదేశాలిస్తుంది. అలాగే గుర్తింపు రద్దునకు సైతం ఆదేశాలు జారీ చేస్తుంది. పరిస్థితిని బట్టి జరిమానాలు కూడా విధిస్తుంది.

మరిన్ని వార్తలు