వైఎస్సార్‌సీపీ సై.. టీడీపీ నై..!

14 Jan, 2020 09:52 IST|Sakshi

పార్టీల్లో స్థానిక ఎన్నికల వేడి 

సమరోత్సాహంలో వైఎస్సార్‌సీపీ 

ఇప్పటికే ప్రారంభమైన అభ్యర్థుల ఎంపిక కసరత్తు 

నైరాశ్యంలో ప్రతిపక్ష టీడీపీ 

పోటీకి అభ్యర్థులూ దొరకని పరిస్థితి 

నియోజకవర్గాల్లో నేతల విముఖత 

చేజారిన క్యాడర్‌తో డీలా 

సాక్షి ప్రతినిధి కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో స్థానిక ఎన్నికల కోలాహలం జోరందుకుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఆయన పాలన జనరంజకంగా సాగుతుండటంతో అధికారపార్టీ ఉత్సాహంలో ఉంది. గత ఎన్నికలలో  ఘోర ఓటమితో కుప్పకూలిన ప్రతిపక్ష టీడీపీకి స్థానిక పోరు పెద్ద పరీక్షగా తయారైంది. కనీసం పోటీకి  అభ్యర్థులు కూడా దొరకని నేపథ్యంలో ఏం చేయాలో ఆపార్టీకి పాలుపోవడం లేదు. జిల్లాలో మరోపక్క  ఫిబ్రవరి 15 నాటికి 558 ఎంపీటీసీ, 50 జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు  జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ , 50 మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నిక  పూర్తికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 3 నాటికి 790  గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈనెల17న ఎన్నికల తేదీలు ఖరారయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

పోటీకి వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ ముందడుగు వేస్తుండంగా టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. పోటీకి  నిలబడలేని పరిస్థితిలో చతికిల పడింది.  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి  స్థానిక ఎన్నికలపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించడంతో 10 నియోజకవర్గాల శాసన సభ్యులు అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. కొందరు  కమిటీలకు  ఎంపిక బాధ్యతను కట్టబెట్టారు. అన్ని నియోజకవర్గాలలోనూ అధికారపార్టీ తరపున పోటీచేసేందుకు క్యాడర్‌ పోటీ పడుతోంది. ఒక్కొక  స్థా నంనుండి 5 నుండి 10 మందివరకూ పోటీకి సై అంటున్నారు. రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

చదవండి: చంద్రబాబూ.. గో బ్యాక్‌

అగమ్య గోచరం 
మరోవైపు జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గత ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూడడంతో నేతలతో పాటు క్యాడర్‌ తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చేతులు కాల్చుకుంటామనే భయంతో కొన్ని నియోజకవర్గాల నేతలు ఎన్నికల జోలికి వెళ్లేందుకు జంకుతున్నారు. గత ఎన్నికలలో కడప పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల చీత్కారంతో ఓటమి పాలైన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ పాతకాపు సీఎం రమేష్‌ సైతం బీజేపీలో చేరారు. మిగిలిన చోటామోటా నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరమై మిన్నకుండి పోయారు.  కొందరు అంటీముట్టనట్లుగా ఉన్నారు.
 
బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె. విజయమ్మ  పార్టీ కార్యక్రమాలే కాదు  చంద్రబాబు పర్యటనకూ దూరంగా ఉన్నారు.  డాక్టర్‌  రాజశేఖర్‌ మొక్కుబడిగా హాజరవుతున్నారు.  ఏడుమండలాల క్యాడర్‌ సైతం దాదాపుగా పారీ్టకి దూరమైంది.  
మైదుకూరులో  పుట్టా సుదాకర్‌యాదవ్‌  నియోజకవర్గం వదలి హైదరాబాద్‌లో మకాం పెట్టారు. ఉన్నక్యాడర్‌లో చాలామటుకు స్థానిక ఎన్నికల వేదికగా అధికారపారీ్టలో చేరేందుకు సిద్దమయ్యారు.  
రాయచోటి నియోజకవర్గంలో శ్రీనివాసులు రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా ఒకటీ అరా చోట్ల మినహా ప్రభావం చూపే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఛీప్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలో విజయదుంధుభి  మోగించనుంది. 

రాజంపేట నియోజకవర్గంలో బత్యాల చెంగల్రాయుడు తిరుపతికి పరిమిత మయ్యారు. ఆయనను నమ్మి ఉన్న అరకొర కార్యకర్తలుస్థానిక ఎన్నికలలో పోటీకి నిలబడే పరిస్థితి లేదు.  ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, ఆకేపాటీ అమరనాథరెడ్డిల నాయకత్వాన్ని ఢీ కొట్టే పరిస్థితి టీడీపీకి లేదు. 
రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికారపార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వరుసవిజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నేతలు బత్యాల, విశ్వనాథనాయుడు ల మధ్య సఖ్యతలేదు. క్యాడర్‌లో స్థబ్దత నెలకొంది. నామమాత్రపు స్థానాల్లో మినహా పోటీకి నిలిచే సరిస్థితి లేదు. 
జమ్మలమడుగులో క్యాడర్‌ను కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా  రామసుబ్బారెడ్డి నామమాత్రంగా కొన్ని స్థానా ల్లో పోటీకి నిలిపే అవకాశముంది ఉన్న ట్లు  తెలుస్తోంది.  శాసనసభ్యుడు సుదీ ర్‌రెడ్డి నేతృత్వంలో  మరోమారు ఘనవిజయాన్ని  కైవసం చేసుకోనుంది. 

శాసనసభ్యుడు రవీంద్రనాథరెడ్డి నాయకత్వంలో కమలాపురం నియోజకవర్గంలో అధికారపార్టీ  స్థానిక ఎన్నికలలో ఘనవిజయం సాధించనుంది. పుత్తా నరసింహారెడ్డి  ఉనికిని చాటుకునేందుకు కొన్ని స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నా క్యాడర్‌ విముఖతతో ఉన్నట్లు తెలిసింది.   
కడపలో  టీడీపీ క్యాడర్‌  పూర్తిగా ఢీలా పడిపోయింది. పోటీకి  ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ  డిప్యూటీ సీఎం అంజాద్‌భాషా ప్రతినిద్యం వహిస్తుండగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మన్‌ సురేష్‌బాబు తో పాటు పలువురు నేతల ప్రభావం ఈ నియోజకవర్గం పై ఉంది. దీంతో ఇక్కడ టీడీపీ దాదాపు కనుమరుగే. 

ప్రొద్దుటూరులో టీడీపీ సరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్న నేతలు ఎవరికివారే ఎమునాతీరే అన్న చందంగా ఉన్నారు. అధికారపార్టీ శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాదరెడ్డి  నిత్యం జనంలోఉండి వారి బాగోగులు చూస్తున్నారన్న పేరు గడించారు. దీంతో  స్థానిక ఎన్నికలలో ధికారపారీ్టకి తిరుగుండదన్నది అందరి అభిప్రాయం.   
పులివెందులలో టీడీపీ చాలాచోట్ల పోటీకి ముందుకు వచ్చే పరిస్థితి లేదు.  పులివెందుల నియోజకవర్గంలో వేల కోట్ల అభివృద్దిపనులకు  ముఖ్యమంత్రి  శంకుస్థాపనలు చేశారు.  రాబోయే కాలంలో  మరిన్ని అభివృద్ది పనులు చేపట్టనున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు టీడీపీ వైపు చూసే పరిస్థితి లేదు.

మరిన్ని వార్తలు