సహాయం కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడి
వీడియో చిత్రీకరించి బ్లాక్మెయిల్
టీడీపీ నేత కావడంతో పట్టించుకోని పోలీసులు..
మీడియాను ఆశ్రయించిన బాధితురాలు
సాక్షి, కడప : సహాయం కోసం వచ్చిన ఓ యువతిపై టీడీపీ నేత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూతురు వయసున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడటమే కాక.. వీడియో తీసి నాలుగు నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తూ చిత్రహింసలు పెట్టాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో.. చివరకు ఆ యువతి మీడియాను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని గవర్నర్ నరసింహన్ను వేడుకుంది. వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన బాధితురాలు ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడింది. ‘తల్లి చనిపోగా.. ఉపాధి కోసం మా నాన్నతో పాటు నా భర్త గల్ఫ్ వెళ్లారు. ఐదు నెలల నుంచి కడపలోనే లేడీస్ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో పని చేస్తున్నాను. ఈ సమయంలో ఖాజీపేటకు చెందిన సీఆర్ పాషా, ఖదీరుల్లాతో పరిచయం ఏర్పడింది. వారు ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు తండ్రి గుజ్జల రామకృష్ణ(70)తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన వద్దకు తీసుకెళ్లారు. మైనార్టీ కార్పొరేషన్ నుంచి కుట్టుమిషన్తో పాటు తన కుమారుడు చైర్మన్గా ఉన్న ఆప్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని రామకృష్ణ హామీ ఇచ్చారు.
పెద్దాయన కావడంతో ఆయన మాటలు నిజమేననుకున్నాను. ఆ తర్వాత రామకృష్ణ మాయమాటలు చెప్పి.. ఓ ఇంట్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు’ అని బాధితురాలు వాపోయింది. మీ కూతురు లాంటి దానినని ఎంతగా వేడుకున్నా ఆయన వినకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడని కన్నీరుపెట్టుకుంది. ఆ తర్వాత నుంచి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడని వివరించింది. రహస్యంగా వీడియో తీశానని, నగ్న వీడియోలు యూట్యూబ్లో పెడతానని బెదిరించి పలుమార్లు బలాత్కారానికి పాల్పడ్డాడని వాపోయింది. దీనిపై కడప వన్టౌన్ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేస్తే.. ఏఎస్ఐ తనను దుర్భాషలాడాడని ఆరోపించింది. తెల్ల కాగితంపై సంతకం తీసుకొని.. రూ.50 వేలు ఇస్తాం వెళ్లిపోవాలంటూ బెదిరించినట్లు పేర్కొంది. రామకృష్ణ ఆగడాలు భరించలేక నాలుగుసార్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వివరించింది. తనకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని.. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. కాగా, రామకృష్ణ లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు వాట్సాప్లో ప్రత్యక్షమయ్యాయి.