నరసరావుపేటరూరల్ :
తనతో వివాహేతర సంబంధం తెగతెంపులు చేసుకుందనే అక్కసుతో ప్రియురాలిని హతమార్చి, ప్రియుడూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం నరసరావు పేట మండలం పమిడిమర్రు గ్రామంలో జరిగింది. స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సంతమాగులూరు గ్రామానికి చెందిన పోశలకపోత మహాలక్ష్మమ్మ(25) కొంత కాలంగా తన భర్త వీరబాబుతో విభేదించితన ఊరైన పమిడిమర్రులో తండ్రి సింగయ్య వద్ద ఉంటోంది.
అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గర్నెపూడి సుధాకర్ (30), మహాలక్ష్మమ్మల మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, ఇరువర్గాల కుటుంబ సభ్యులు పంచాయతీ నిర్వహించి వివాహేతర సంబంధం కొనసాగించటానికి వీలులేదంటూ కొద్దిరోజుల క్రితం తీర్మానం చేశారు.
అప్పటి నుంచి మహాలక్ష్మమ్మ సుధాకర్కు దూరంగా ఉంటోంది. అయితే తనతో సంబంధం కొనసాగించాలంటూ సుధాకర్ ప్రతిరోజూ ఆమె వెంట పడుతున్నట్లు తెలిసింది.
ఎప్పటిలానే మంగళవారం కూడా మహాలక్ష్మమ్మ తోటి కూలీలతో కలసి తంగేడుమల్లి మేజరు కాలువ సమీపంలోని ఓ పొలంలో కలుపు తీసేందుకు వెళ్లింది.
ఈ సమాచారం తెలుసుకున్న సుధాకర్ తన ఆటోలో చెట్లు నరికే కత్తి, పురుగు మందు డబ్బా పెట్టుకొని పొలం వద్దకు వెళ్లి మహాలక్ష్మమ్మపై దాడి చేశాడు. కత్తితో చెవి, మెడపైన నరికాడు. దీంతో ఆమె కుప్పకూలింది.
అనంతరం సుధాకర్ తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు.
పక్క పొలాల్లో పనిచేస్తున్న కూలీలు కొనఊపిరితో ఉన్న మహాలక్ష్మమ్మను గ్రామంలోకి తీసుకువచ్చి 108కు సమాచారం అందించారు. ఆ వాహనం వచ్చేలోగా ఆమె మృతి చెందింది.
ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు, ఎస్ఐలు రమేష్, సురేష్బా బు, ఆనంద్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహాలక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సుధాకర్కు భార్య, పాప ఉండగా, మృతురాలికి రెండేళ్ల బాబు ఉన్నాడు. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.