కళకళ..వెలవెల!

15 Jan, 2015 02:22 IST|Sakshi
కళకళ..వెలవెల!

తుళ్లూరు/ తాడేపల్లి :  రైతుల ఇంట అతిపెద్ద పండుగ సంక్రాంతికి సంబంధించి రాజధాని ప్రాంతంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఆనందాలు, సంతోష సంబ రాలతో కళకళలాడుతుండగా, మరో వైపు భవితపై బెంగతో ఆందోళన చెందుతున్న రైతుల లోగిళ్లు వెలవెలబోతున్నాయి. తుళ్లూరు మండలంలోని మెట్టభూముల రైతులు ఈ పండుగను ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.

జరీబు భూములు ఉన్న గ్రామాల్లో సంక్రాంతి సందడి కనిపించటం లేదు. ఆది నుంచి ఇక్కడి రైతులు రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఏటా మూడు పంటలు పండే భూములు ఇస్తే భవిష్యత్ ఏమిటనేది అర్థంకాని పరిస్థితిలో సంక్రాంతి వేళ సైతం తమ నిరసనలను ముగ్గుల రూపంలో తెలియజేస్తున్నారు.
     
తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతు కుటుంబాల మ హిళలు తమ భూము లు ఇవ్వబోమనే రీతి లో ముగ్గులు వేశారు. రాజధాని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ గ్రామాల్లో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. తమ భూములను ప్ర భుత్వం లాగేసుకుంటే ఎలా బతకాలనే ఆందోళనతో కాలం గడు పుతున్నారు.
     
ఉండవల్లి, పెనుమాకలో సంక్రాంతి కళ తప్పింది. భోగి మంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి పెనుమాక, ఉండవల్లిలో నిరసనలతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం రైతు కుటుంబాల్లో సంక్రాంతి హడావుడి కనిపించడంలేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం పెనుమాక, ఉండవల్లి రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి రైతులు ఏదో ఒక రూపంలో నిరసనలు తెలియజేస్తున్నారు.

అరుునా సర్కారు తన నిర్ణయూన్ని వెనక్కు తీసుకోలేదు. మూడురోజుల నుంచి పెనుమాక, ఉండవ ల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని భూమి ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మరో పక్క పోలీసు పికెట్ గ్రామంలో ఏర్పాటుచేశారు. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా పెనుమాక , ఉండవల్లివాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
తుళ్లూరు మండలంలో  ఘనంగా సంక్రాంతి..
     ఇప్పటివరకు పల్లెటూరుగా వున్న తుళ్లూరు ఒక్కసారిగా నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా మారిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
     భూములు విక్రయించుకోవడంతో వచ్చిపడిన డబ్బుతో పండుగను గత ఏడాది కంటే రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాల నిర్వహణకు నిధులు విడుదల చేయడంతో గ్రామాలన్నీ పండుగ ఊపులో ఉన్నాయి. బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
     తుళ్లూరుతోపాటు అనేక గ్రామాల్లో సేవాసంస్థలు, ప్రజాసంఘాలతో పాటు ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం త్వరగా జరగాలని, గ్రామాలు సుఖశాంతులతో ఉండాలని సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు.
     {పధానంగా తుళ్లూరు, పెదపరిమి, మందడం, రాయపూడి, అనంతవరం, వడ్డమాను, బోరుపాలెం గ్రామాలలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి, కనుమ పండుగలను కూడా అదేస్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బంధువులు, స్నేహితుల రాకతో అక్కడి రైతుల లోగిళ్లు కళకళలాడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు