విజయవాడ: దసరాలోపు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కనకదుర్గ ఆలయ చైర్మన్ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని మాడపాటి సత్రంలో దుర్గగుడి తొలి పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కనకదుర్గమ్మ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. దసరా ఏర్పాట్లపై పాలకమండలి సమావేశంలో చర్చించింది. దసరాను ప్రభుత్వ పండుగగా ప్రకటించినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదన్నారు.
దసరాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో చర్చించిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని, దాదాపు రూ.10 కోట్లు అడుగుతున్నట్లు, 70 వేల మంది దుర్గమ్మ దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు వారు వివరించారు. దుర్గమ్మకు సోలార్ వెలుగుల కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.