ఐదేళ్లపాటు అభివృద్ధికి నోచుకోని కందుకూరు

11 Apr, 2019 12:05 IST|Sakshi

ఇసుక, మట్టి దగ్గర నుంచి సంక్షేమ పథకాల పేరుతో విచ్చలవిడిగా అవినీతి

మండలాల వారీగా ఇన్‌చార్జులకు పాలన అప్పగించిన ఎమ్మెల్యే పోతుల

నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్రకు విశేష స్పందన

సాక్షి, కందుకూరు (ప్రకాశం): ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ పాలనను ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ చూసినా అవినీతి, దోపిడి, దౌర్జాన్యాలే కనిపిస్తాయి. నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధుల పాలనకు బదులు బయట వ్యక్తుల పెత్తనం అధికం. ఉద్యోగులపై దాడులు, ఇసుక, మట్టి తవ్వకాల ద్వారా విచ్చలవిడిగా దోపిడీ ఇవే కనిపిస్తాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవగా ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దోచేశారు.

2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ పాలన సాగిన తీరు ఇది. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రజల పక్షాన నిలిచి, అనేక ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా సాగింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రభావంతో కొన్ని సమస్యలైనా ప్రభుత్వం పరిష్కరించింది. ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మేలును వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. 

టీడీపీ హయాం..
ఇన్‌చార్జ్‌లు తాము చెప్పినట్టే వినాలంటూ అధికారులపై ఒత్తిడి చేయడమే కాదు, దాడులకు తెగబడ్డారు. సాక్షాత్తు మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ ఆర్‌ఐపై సుధాకర్‌ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
1. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఎన్నికల్లో ఓడిపోయిన దివి శివరాం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దాదాపు రెండున్నరేళ్లపాటు ఆయనే నియోజకవర్గంలో పెత్తనం చేశారు.
2. ఈ రెండున్నరేళ్ల కాలంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. ప్రధానంగా నియోజవకర్గంలో ఉన్న ఇసుక రేవులను లక్ష్యంగా చేసుకుని వందల కోట్ల విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేని కారణంగానే కందుకూరు మండల తహశీల్దార్‌ రాజ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు అంటే ఏ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 
3. ఇక సబ్సిడీ బియ్యం దోపిడీకి విచ్చలవిడిగా పాల్పడ్డారు. ఏకంగా ఎంఎల్‌సి పాయింట్‌నే లక్ష్యంగా చేసుకుని అక్రమ పద్ధతిలో తరలించారు. 
4. రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పెంపకం పేరుతో కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు.
5. నీరు–చెట్టు పథకం కింద చెరువుల అభివృద్ధి, మట్టి తోలకం పేరుతో పనులు చేయకుండానే విచ్చలవిడిగా దోచుకున్నారు. 
6.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేకుండా పోయింది. 
7. రెండున్నరేళ్ల తరువాత ఎమ్మెల్యే పోతుల రామారావు వైఎస్సార్‌సీపీ నుంచి అధికార పార్టీలోకి జంప్‌ అయ్యారు. 
8. ఇక్కడి నుంచి పాలన పూర్తిగా మారిపోయింది. ఎమ్మేల్యే తన అనుచరులను మండలలాల వారీగా ఇన్‌చార్జులుగా నియమించారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధం లేని ఆయన బంధువులను, ఇతర వ్యక్తులను మండలాల ఇన్‌చార్జులుగా నియమించారు. దీంతో పాలన మొత్తం వారి కనుసన్నల్లోనే సాగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనికావాలన్న ప్రజలు ముందుగా ఈ ఇన్‌చార్జులను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 
9. ఇక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలోను పూర్తిగా విఫలమైంది. 2014లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో రెండు నెలల క్రితమే హడావిడి శంకుస్థాపన చేశారు. 
10. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు అందించే సోమశిల ఉత్తర కాల్వ పనులను పూర్తి చేయడంలో విఫలమైయ్యారు. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. దీంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయింది. 
11. రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఐదేళ్ల క్రితమే నిధులు మంజూరైనా ఇప్పటి వరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులు మొదలు పెట్టలేని దుస్థితి నెలకొంది. 
12. ఇక కందుకూరు పట్టనంలో ట్రాఫిక్‌ నివారణ కోసం పట్టణం వెలుపల నుంచి బైపాస్‌ రోడ్డు నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరైయ్యాయి. కాని ఎమ్మెల్యే పోతుల రామారావు అసలు బైపాస్‌రోడ్డు అనేదే లేదని చెప్పడం విడ్డూరంగా తోచింది. ఇప్పటికీ ఆ రోడ్డు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైయ్యాయి. అలాగే పట్టణంలో రూ 1.80 కోట్లతో చేపట్టిన పార్కు నిర్మాణం చేయకుండా వదిలేశారు. 
13. ఉద్యానవన కళాశాల, పశువైద్యకళాశాల మంజూరు చేశామని చెప్పినా కాగితాలకే పరిమితమైయ్యాయి. 

ప్రజా సమస్యలపై పోరాటమే వైఎస్సార్‌సీపీ అజెండా..
ఐదేళ్ల కాలంలో ప్రజా  సమస్యలపై  పోరాటమే వైఎస్సార్‌సీపీ అజెండాగా పెట్టుకుని పనిచేసింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాళ్లపాడు ప్రాజెక్టు సోమశిల నుంచి నీరు ఇవ్వడంతో పాటు, రామాయపట్నం పోర్టు నిర్మించి తీరుతానని హామీ ఇచ్చారు. జగన్‌ హామీతోనే దిగివచ్చిన ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు హడావిడి శంకుస్థాపన చేసింది. 
1. ప్రధానంగా రైతుల సమస్యలపై వైఎస్సార్‌ సీపీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సోమశిల ఉత్తర కాల్వను పూర్తి చేయాలంటూ ఆందోళనకు దిగారు. కాల్వను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. 
2. పట్టణంలో జీప్లస్‌ ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై విస్తృత పోరాటం చేసింది. అధిక వడ్డీలు, బ్యాంకు రుణాల పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లింది. 
3. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు చేశారు. 
4. రామాయపట్నం పోర్టు నిర్మించాలంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కావలి పట్టణం నుంచి రామాయపట్నం వరకు భారీ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. 
5. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో వారికి అండగా వైఎస్సార్‌ సీపీ నిలిచింది. వలేటివారిపాలెం మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను స్వయంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వారికి పరిహారం వచ్చేలా కృషి చేశారు. 
6. ఇక ఏడాది కిత్రం నియోజవకర్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలోని లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు మండలాల పరిధిలో మూడు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యల సమస్యలను దగ్గర ఉండి తెలుసుకోవడంతో పాటు, దీర్ఘకాలిక సమస్యలపై పరిష్కారానికి హామీలిచ్చారు.

>
మరిన్ని వార్తలు