కాపులపై బాబు ఉక్కుపాదం మోపినప్పుడు ఎక్కడున్నావ్‌ పవన్‌?

28 Jun, 2020 05:04 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపాటు

సాక్షి, అమరావతి: కాపులపై చంద్రబాబు ఉక్కుపాదాన్ని మోపినప్పుడు, కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని లాఠీలతో కుళ్లబొడిచి ఆయన భార్యను, కుమారుడిని బండ బూతులు తిడుతూ నిర్బంధించినప్పుడు నోరు విప్పని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారా? పాత మిత్రుడు చంద్రబాబుతో చెలిమిని పోగొట్టుకోలేక పవన్‌ మాట్లాడుతున్నారా? 
► కాపు రిజర్వేషన్‌ పోరాటాన్ని ఎవరు నీరు గార్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలి.
► కాపులకు ఇచ్చిన మాట ప్రకారం 45–60 ఏళ్ల మధ్య వయస్కులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు అందించడం ప్రారంభమైంది. కాపు నేస్తం కింద దరఖాస్తు చేసుకున్న 2,35,873 మంది మహిళలకు రూ.354 కోట్లను అందించాం.
► ఇంకా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వాళ్లకీ ఇస్తాం.
► వాస్తవం ఇలా ఉంటే.. పవన్‌ లాంటి వాళ్లు మా ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించడం విడ్డూరం. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం తిరిగి తలెత్తకుండా ఉండేందుకే ఈ సాయం అందిస్తున్నట్టు మాట్లాడడం దారుణం.
► ఐదేళ్లలో చంద్రబాబు రూ.1,879.64 కోట్లను 2.54 లక్షల మంది కాపులకు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,770 కోట్లను ఇచ్చాం.

మరిన్ని వార్తలు