దారుణం

25 Feb, 2016 01:43 IST|Sakshi

జిల్లావ్యాప్తంగా రుణాల కోసం 11,904 మంది కాపుల వినతి
53 మందికే యూనిట్ల కేటాయింపు
20,269 బీసీ దరఖాస్తుల్లో 334 మందికే  మంజూరు

 
కాపు కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరికీ రుణాలిస్తామని నిరాహారదీక్ష సందర్భంగా కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభానికి హామీ ఇచ్చిన తెలుగుదేశం సర్కారు ఇప్పుడు మాట తప్పింది. దరఖాస్తుదారుల్లో కేవలం 20 శాతం మందికే రుణాలివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రుణాలు కూడా పూర్తిస్థాయిలో ఇచ్చే పరిస్థితి కానిపించడం లేదు. అదేవిధంగా బీసీ కొర్పొరేషన్ కింద వినతులిచ్చినా వారికీ చుక్కెదురవుతోంది.
 
చిత్తూరు: కాపులందరికీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని నట్టేట ముంచారు. కాపు కార్పొరేషన్‌కు రూ. వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని తక్షణం రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది. అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేసింది. 50 శాతం సబ్సిడీ లభిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా సోమవారం నాటికి 11,904 మంది కాపులు రుణాల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి రూ.73 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకున్న వారిలో కేవలం 2,462 మందికి మాత్రమే రుణాలివ్వాలని ఈ నెల 12 నసమావేశమైన బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రూ.14.72 కోట్లను కేటాయించింది. జిల్లావ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో ఈ సంఖ్య 20 శాతం మంది మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరానికి మరో నెల మాత్రమే గడువుంది. గడువు లోపు ప్రభుత్వం చెప్పిన మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేయడం అసాధ్యం. ఇప్పటివరకు 53 మందికి రూ.37 లక్షల రుణాన్ని  కాపు కార్పొరేషన్ మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముందు ప్రకటించినట్లు జిల్లా కేంద్రంలో కాపు కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంతవరకు కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దానికి ప్రత్యేక అధికారులను నియమించలేదు. కేవలం బీసీ కార్పొరేషన్ అధికారులే కాపు కార్పొరేషన్ రుణాల మంజూరు వ్యవహారాలను చూస్తున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలన సైతం సక్రమంగా ముందుకు సాగడం లేదు. దీంతో అధికారులు వివిధ రకాల కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేం చెప్పినవారికే రుణాలు ఇవ్వాలి
కాపు రుణాలను తాము చెప్పినవారికే ఇవ్వాలంటూ జన్మభూమి కమిటీలు బ్యాంకర్లను బెదిరిస్తున్నాయి. అర్హులను గుర్తించి రుణాలిస్తామని అధికారులు చెప్పినా వారు వినడంలేదు. ఏకంగా కాపు కార్పొరేషన్, బ్యాంకులకు వెళ్లి అధికారులను బెదిరిస్తున్నారు. మంగళవారం పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకుకు వెళ్లిన జన్మభూమి కమిటీసభ్యులు తాము చెప్పినట్లు రుణాలివ్వకపోతే ఉద్యోగం మానుకుని వెళ్లమంటూ అక్కడి మేనేజర్‌ను  బెదిరించడం గమనార్హం.
 
బీసీ రుణాలూ హుళక్కే
 అర్హులైన బీసీలందరికీ రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రుణాల మంజూరులో బీసీలను వంచిం చింది.  బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లావ్యాప్తంగా 20,269 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు కేవలం 334 మందికి రూ.3.8 కోట్ల బ్యాంకు రుణాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులో మిగి లిన వారికి రుణాలిచ్చే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 8,377 మంది రూ.75.78 కోట్లు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో కేవలం 334 మందికి మాత్రమే రుణాలిచ్చారు. ఇక బీసీ ఫెడరేషన్ పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను 411 రూట్ల పరిధిలో 6,165 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ కింద రుణాలిస్తామని చెప్పిన బ్యాంకులు కేవలం 221 గ్రూపులకు మాత్రమే మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకున్నాయి.
 
 

మరిన్ని వార్తలు