కాపుల అభ్యున్నతికి సీఎం కట్టుబడి ఉన్నారు..

18 Oct, 2019 14:07 IST|Sakshi

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా కాపులను మోసం చేశారని..కాపుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. విజయవాడలో రెండో రోజు జరుగుతున్న ‘కాపు విదేశీ విద్య దీవెన’ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో జక్కంపూడి రాజా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీని వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారన్నారు. కాపులకు ప్రతి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు సీఎం జగన్‌ కేటాయిస్తున్నారని వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన ఉభయగోదావరి జిల్లాలో కాపులు వైఎస్‌ జగన్‌కు అండగా నిలబడ్డారన్నారు.

ఇస్తామని చెప్పి మోసం చేశారు..
కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని.. కానీ వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2,000 కోట్లు కాపులకు కేటాయించారని పేర్కొన్నారు. ఐదేళ్లలో కేవలం 1,700 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారని విమర్శించారు. కాపు విదేశీ దీవెన పథకానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవని.. వైఎస్‌ జగన్‌ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

వారికి మాత్రమే లోన్లు ఇచ్చేవారు: మంత్రి వెల్లంపల్లి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే లోన్లు ఇచ్చేవారని.. వైఎస్‌ జగన్‌ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది కాపు విదేశీ విద్య దీవెన పథకం ద్వారా 1000 మందిని విదేశాలకు పంపుతున్నామని మంత్రి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలనలో దళారులకు స్థానం లేదని.. సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయని తెలిపారు.
 

మరిన్ని వార్తలు