కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

30 Jun, 2015 12:29 IST|Sakshi

ఏలూరు: కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించలేదని ఓ యువకుడు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. లింగంపాలెం మండలంలోని బుల్లావారిగూడెం నుంచి కొత్తపల్లి తూరలు వరకు 1.5 కిలోమీటరు మేర రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, రోడ్డు నిర్మాణాన్ని కోరుతూ ఉపాధి కూలీ కాట్రు వెంకన్న(22) వినతి పత్రం ఇచ్చేందుకు ఏలూరు కలెక్టరేట్‌కు వచ్చాడు.

అయితే, ప్రజావాణి కార్యక్రమం ఉన్నందున అతన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో తనను ఆపుతారా అంటూ వెంకన్న అక్కడే ఎత్తయిన గోడ ఎక్కి దూకే ప్రయత్నం చేయబోగా స్పందించిన గన్‌మెన్లు అతన్ని పట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు