సీఎం జగన్‌ చూపిన ఆప్యాయతతో నూతనోత్తేజం

23 May, 2020 20:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన ఆప్యాయత నూతనోత్తేజాన్ని ఇచ్చిందని యువ ఐఏఎస్‌ కట్టా సింహాచలం అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో నిబద్ధతగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారని తెలిపారు. 2019-బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అనంతరం సింహాచలం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఉత్తమ పాలన అందించేలా ఉన్నాయని అన్నారు. గ్రామస్వరాజ్య స్థాపనకు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దిశా చట్టం మహిళలు సురక్షితంగా ఉండేందుకు భరోసా కల్పిస్తోందన్నారు. (నిబద్ధతతో సేవలందించండి: సీఎం జగన్‌)

అంధత్వాన్ని ఏనాడూ తాను సమస్యగా భావించలేదని, అంగవైకల్యం లక్ష్యానికి ఆటంకం కాదనేందుకు తానే నిదర్శనమని చెప్పారు. సొంతరాష్ట్రంలో ఐఏఎస్‌గా అవకాశం రావటం తన అదృష్టమని సింహాచలం సంతోషం వ్యక్తం చేశారు. తాను డాక్టర్ కావాలనుకున్నానని, కానీ కంటిచూపు సమస్యతో సాధ్యం కాలేదన్నారు. ప్రజాసేవ చేయాలన్న పట్టుదలతో ఐఏఎస్‌ సాధించానని, లోపాలు ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సహిస్తే దేన్నైనా సాధిస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కట్టా సింహాచలం పుట్టుకతోనే అంధుడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన పట్టువదలని దృఢ సంకల్పంతో ముందుకు సాగి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. (ఐఏఎస్‌ అంతు చూశాడు)

మరిన్ని వార్తలు