కావలి ఎమ్మెల్యే దీక్షకు జిల్లా నేతల మద్దతు

20 Feb, 2015 02:23 IST|Sakshi

తిరుపతిరూరల్: నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే బండి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి వెళ్లి ఎమ్మెల్యేతో పాటు దీక్షలో కూర్చున్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరువు ప్రారంభమైందన్నారు.

వైఎస్.రాజశేఖరరెడ్డి హాయంలో పుష్కలంగా పడిన వర్షాలు చంద్రబాబు రాగానే ముఖం చాటేశాయని ఎద్దేవా చేశారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు ఏ వర్గానికి కూడా మేలు చేయని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబని దుయ్యబట్టారు. గ్రామాల్లో నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే విదేశీ పేరుతో చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రైతులు, ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ నిత్యం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు