హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి ఫామ్హౌస్ బాట పట్టారు. తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన తన ఫామ్హౌస్లో పార్టీ సీనియర్ నాయకులతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణ నోట్ తర్వాత రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పరిణామాలతో ఆయన ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలిసింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రంగా వడిగా అడుగులు వేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై కూడా పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం.
కాగా, నవంబర్ నెలాఖరు కల్లా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో తప్పక ఆమోదం పొందగలదని కేసీఆర్ భావిస్తున్నారు. బిల్లుకు సంబంధించిన మొత్తం పనులు చాపకింద నీరులా పూర్తవుతున్నాయన్నారు. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణవాదులకు సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్హౌస్ భేటీ ఆసక్తి రేకిస్తోంది.