కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించారు

6 Aug, 2013 00:18 IST|Sakshi
:సీమాంధ్ర ఉద్యోగులు అక్కడి ప్రభుత్వాన్ని నడిపేందుకు వెళ్లాల్సి ఉంటుందని తమపార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలను వక్రీకరించారని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం నాడాయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు నడవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేసి తప్పుపట్టడం అర్థరహితమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి మాట్లాడటం అవివేకమన్నారు. 
 
 పొట్టలుగొట్టే వారిపైనే తమ పోరాటం ఉంటుందని వివరించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే అందరం కలిసే ఉంటామని, సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బదిలీలు రాజ్యంగబద్ధంగానే జరుగుతాయని తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రకటనతో సమైక్య ఉద్యమం, ఏకపక్ష నిర్ణయమంటూ రాద్ధాంతం చేయడమేమిటని ప్రశ్నిం చారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొంది తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్లని అన్నారు.
 
 7న టీఆర్‌ఎస్ సర్పంచ్‌లకు సన్మానం
 ఈనెల 7న నల్లగొండ నియోజకవర్గంలో గెలిచిన టీఆర్‌ఎస్ సర్పంచ్, ఉపసర్పంచులను స్థానిక ఎన్జీ కళాశాలలో సన్మానిస్తామని చాడ కిషన్‌రెడ్డి తెలిపారు. అనంతరం భారీ ర్యాలీగా తరలివెళ్లి క్లాక్‌టవర్ సెంటర్‌లో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు మాలె శరణ్యారెడ్డి, పున్న గణేష్, అభిమన్యు శ్రీనివాస్, జి.సురేందర్, రవినాయక్, లింగస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు