పుట్టపర్తిలో కేరళ వాసి ఆత్మహత్య

22 Jan, 2014 03:02 IST|Sakshi

 పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్:  కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన చేతి నరాలను కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన   పుట్టపర్తిలో మంగళవారం చోటు చేసుకుంది. పుట్టపర్తి పట్టణ సీఐ వేణుగోపాల్, మృతుని మేనమామ శశికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా షోర్నూర్‌కు చెందిన ఉన్నికృష్ణన్ (32) దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కొంతకాలం క్రితం కేరళకు తిరిగి వచ్చిన ఆయన, ఈ నెల 9న పుట్టపర్తికి వచ్చాడు. ఉన్నికృష్ణన్ మేనమామ శశికుమార్ ఐదు నెలల కిందట పుట్టపర్తికి వచ్చి చిత్రావతి గుట్ట వద్ద చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటూ.. ప్రశాంతి నిలయంలో భక్తులకు సేవ చేస్తున్నాడు.
 పది రోజుల పాటు మేనమామ గదిలోనే ఉన్న ఉన్నికృష్ణన్ అనంతరం 19వ తేదీ రాత్రి చిత్రావతి రోడ్డులోని జయసాయి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని అందులోకి మారాడు.
 
 సోమవారం రాత్రి మేనమామతో కలసి ప్రశాంతి నిలయానికి వెళ్లి వచ్చాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ లాడ్జి గది నుంచి బయటికి రాకపోవడంతో శశికుమార్.. ఉన్నికృష్ణన్ గదికి వెళ్లి పరిశీలించాడు. చేతి నరాలు కోసుకోవడంతో తీవ్ర రక్త స్రావమై.. మంచంపైనే విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే శశికుమార్ పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య సుచిత్ర, 18 నెలల వయసున్న కుమారుడు నిరంజన్ వారి స్వస్థలమైన షోర్నూర్‌లో ఉంటున్నారు. కాగా, ఉన్నికృష్ణన్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
 

మరిన్ని వార్తలు