సాక్షి, కర్నూలు: గడచిన మూడేళ్ళుగా తమకు ఏవిధమైన న్యాయం జరగలేదని కేశవరెడ్డి బాధితులు వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, మలికి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సీఐడీ ఏఎస్పీని కలిశారు. తమకు డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేశవరెడ్డి ఆస్తులు సీఐడీ స్వాధీనంలో ఉన్నాయని న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం, అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ఆదాయం సుమారు రూ. 100కోట్లు పైనే అని, ఆ మొత్తం ఎటు వెళ్లిందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం తమకు చెల్లించినా కొంత ఊరట కలిగేదన్నారు. వందల కోట్ల రూపాయల మోసం చేసిన కేశవరెడ్డి కుమారునికి స్కూల్ నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు.
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
కేశవరెడ్డి, ఆయన వియ్యంకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగాగే బాధితులకు డబ్బు కట్టకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, జగోపాల్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. బాధితులను బెదిరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.