ఏబీవీ అసలు రంగు బయట పెట్టిన కేశినేని

10 Feb, 2020 02:51 IST|Sakshi

ఆయన అక్రమాలు పరోక్షంగా అంగీకరిస్తూ విజయవాడ ఎంపీ ట్వీట్‌  

దానిపై వెనువెంటనే స్పందిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు రీట్వీట్‌  

వారి గుట్టు వారే బయట పెట్టుకున్న వైనం

సాక్షి, అమరావతి :  ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు అసలు రంగును విజయవాడ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ హయాంలో ఆయన చేసిన అక్రమాలు నిజమేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందించి రీట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.  వారి గుట్టును వారే బయట పెట్టుకున్నట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశ భద్రతా రహస్యాలను బయట పెట్టారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేశినేని నాని.. ‘మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్‌ చేశారేంటి జగన్‌మోహన్‌రెడ్డి గారూ’ అని ఆదివారం ట్వీట్‌ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందిస్తూ.. ‘మీరూ, మీరూ పార్లమెంట్‌లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి.

నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని కామెంట్‌ చేశారు. ‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అని మరో ట్వీట్‌ చేశారు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఘన కార్యాలను బయట పెట్టాయి.   

మరిన్ని వార్తలు