జీతాల కోసం రోడ్డెక్కిన కేశినేని ట్రావెల్స్‌ కార్మికులు

26 Jul, 2019 15:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కొంత కాలంగా కేశినేని ట్రావెల్స్‌ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని కార్మికులు లెనిన్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. కార్మికులకు ఎగవేసిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్‌ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల నుంచి కేశినేని ట్రావెల్స్‌ బాధితులు లేబర్‌ కోర్టులో పోరాడుతుంటే, అధికారం అడ్డం పెట్టుకొని లేబర్‌ ఆఫీసర్‌ను సైతం తమ వైపు తిప్పుకున్నారని విమర్శించారు. కార్మికులక చెల్లించాల్సిన ఎనిమిది నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని,  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో సైతం కార్మికులకు జీతాలు చెల్లించాలని పేర్కొన్నారని స్పష్టం చేశారు.

కేశినేని ట్రావెల్స్‌ బాధితుడు రంగారావు మాట్లాడుతూ.. బకాయి పడిన జీతాల కోసం మూడు సంవత్సరాలుగా​​​ తిరుగుతూనే ఉన్నామని, కోర్టును ఆశ్రయించిన సత్వర న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ నాని మనుషులు బెదిరిస్తున్నారని, కొంతమంది కార్మికులను సైతం భయపెట్టి, దాడులు చేసి తమ వైపు తిప్పుకున్నారన్నారని ఆందోళన చెందుతున్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా, ఇచ్చింది తీసుకోవలని తమ కార్యకర్తలతో కొట్టించారన్నారు. ఒక్కో కార్మికుడికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతాలు రావాల్సి ఉందని, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ హోదాలో ఉండి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు