హనీట్రాప్‌ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్‌

15 May, 2020 18:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విశాఖ నౌకాదళ హనీట్రాప్‌ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి 14 మందిని అరెస్ట్‌ చేయగా.. తాజాగా శుక్రవారం రోజున ముంబయికి చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ఇండియన్‌ నావీకి చెందిన నౌకలు, సబ్‌మెరైన్‌ల లోకేషన్‌లను హనీట్రాప్‌లో పడ్డ అధికారులు షేర్‌ చేసినట్లు గుర్తించారు. హనీట్రాప్‌ ద్వారా అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించి పాకిస్థాన్‌కు చేరవేసినట్లు గుర్తించారు.

పాకిస్తాన్‌లో వ్యక్తుల సూచన మేరకు సమాచారం ఇచ్చిన వారి ఖాతాల్లోకి అబ్దుల్‌ రహమాన్‌ నగదును బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా గతంలో ఇతనిపై 120బి, 121ఏ, ఐపీసీ సెక్షన్‌ 17, 18 మరియు సెక్షన్‌ 3యాక్ట్‌ కిందన ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది. అరెస్ట్‌ సమయంలో రహమాన్‌ నుంచి డిజిటల్‌ డివైజ్‌లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కీలక సమాచారం కోసం విచారణ కొనసాగుతున్నట్లు ఎన్‌ఐఏ అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి: హనీట్రాప్‌లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు

కాగా.. భారత నావికులకు ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి వీడియోలు తీసిన పాక్‌ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై సమాచారంతో నిఘా వర్గాలు నెల రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గతంలో 11 మంది నావీ అధికారులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు