కిడారి శ్రావణ్‌  రాజీనామా... ఆమోదం

10 May, 2019 02:00 IST|Sakshi

సాక్షి, అమరావతి:  గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మం త్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమో దించారు. ఈ మేరకు గవర్న ర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కిడారి శ్రావణ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాన్ని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రకు అందజేశారు. సీఎం చంద్రబాబు అనుమతితో దాన్ని సీఎంవో గవర్నర్‌ నరసింహన్‌కు పంపించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు.

దీంతో సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌ కుమార్‌ను గత ఏడాది నవంబర్‌ 11న చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కిడారి శ్రావణ్‌కుమార్‌ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. దీంతో శుక్రవారం నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్‌ కుమార్‌ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సీఎంవో కార్యాలయానికి బుధవారం గవర్నర్‌ కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కిడారి శ్రావణ్‌ కుమార్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.  
 

మరిన్ని వార్తలు