చంద్రబాబుకు అధికారమే పరమావధి

2 Dec, 2018 08:15 IST|Sakshi
మహదేవయ్యనగర్‌లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సమస్యలు తెలుపుతున్న మహిళలు

తెలంగాణా ఓట్లకోసం తిరుగుతున్న ఆంధ్రా సీఎం

 ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సూళ్లూరుపేట: రకరకాల సమస్యలతో ఆంధ్రా ప్రజలు అల్లాడుతుంటే పరిష్కార మార్గం చూపాల్సిన సీఎం చంద్రబాబు అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని వదిలి తెలంగాణాలో ఆంధ్రాద్రోహి కాంగ్రెస్‌ను అధికారంలో నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా తిరుగుతున్నాడని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. సూళ్లూరుపేట మహదేవయ్యనగర్‌లో శనివారం రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే కిలివేటికి తమ సమస్యలు వివరించారు. తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు.

 సమస్యలను స్వయంగా పరిశీంచిన ఎమ్మెల్యే కిలివేటి పర్యటన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యథా రాజ, తథా ప్రజ అన్నరీతిలో ఆంధ్రాలో పాలన సాగుతోందన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి తన కేసులు, తన పలుకుబడి, తన అధికారం అంటూ ఆంధ్రా ద్రోహి కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తెలంగాణా సీఎం కేసీఆర్‌కి భయపడి అమరావతి నిర్మాణం అంటూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉన్న హక్కులను వదిలేసి పారిపోయి వచ్చేశారన్నారు. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ తన జట్టులో సభ్యుడిగా ఉన్న చంద్రబాబుని రక్షించేందుకు ఇద్దరు సీఎంల మధ్య మధ్యవర్తిత్త్వం నెరిపి సమస్య లేకుండా చేసిందని కిలివేటి తెలిపారు. 

ఈ కేసు ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటుందని తెలిసిన చంద్రబాబు భవవిష్యత్‌లో తమకు అండగా నిలిచే కొందరిని పక్కన చేర్చుకోవాలన్న ఉద్దేశంతో తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని తెలివిగా ముందే కాంగ్రెస్‌లోకి పంపి ఇప్పడు తాను కూడా అందులో కలిసి పోయారన్నారు. తెలంగాణాలో ఓట్లకోసం మొసలి కన్నీరు కార్చడం, ఆంధ్రాకి ద్రోహం చేసి అడ్డగోలుగా విభజన చేసిన కాంగ్రెస్‌తో చెట్టపట్టాలు మాని రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, అల్లూరు అనిల్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గండవరం సురేష్‌రెడ్డి, నాయకులు తిరుమూరు రవిరెడ్డి, ఎస్‌కే ఫయాజ్, బి.నవీన్‌రెడ్డి, రాఘవ, లక్ష్మయ్య, నిమ్మల గురవయ్య, మునిరత్నం, శరత్‌గౌడ్, పాలా మురళి, గోగుల తిరుపాల్, దినేష్, అలీ, బిగువు శ్రీనివాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు