విశాఖ శారదా పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి 

6 Jun, 2019 02:10 IST|Sakshi
దీక్షా స్వీకారమహోత్సవం పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కేవీ రమణాచారి, వేణుగోపాలాచారి, శ్రీధర్‌బాబు

ఈ నెల 15,16,17 తేదీల్లో ఉత్తరాధికారిగా స్వీకార మహోత్సవం 

హాజరుకానున్న గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు 

హైదరాబాద్‌: విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ స్టేట్‌ అడిషనల్‌ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు.

ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్‌ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా ఆయ నను నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు