అరకులో తప్పిన పెను ప్రమాదం

13 Jun, 2018 17:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అరకులోయ/విశాఖపట్నం: అరకు అందాలకు దగ్గరగా తీసుకెళ్లి పర్యాటకులను అలరించే కిరండోల్‌-కొత్తవలస(కేకే) రైలుమార్గంలో పెను ప్రమాదం తప్పింది. శిమిలిగూడ, అరకు రైల్వే స్టేషన్ల మధ్య 95/24 నెంబర్‌ వద్ద పట్టాలు విరిగిపోయాయి. రైల్వే సిబ్బంధి అప్రమత్తంగా వ్యవహరిచడంతో ఎటువంటి ఘటన చేసుకోలేదు. దాదాపు 20 మీటర్ల వరకు పట్టాలు మార్చాల్సి ఉంటుందనీ, ఈ పని పూర్తవడానికి ఒక రోజు పడుతుందని జూనియర్‌ ఇంజనీర్‌ అప్పారావు తెలిపారు.

సిబ్బంది అప్రమత్తంగా వ్యహరించడంతో రైల్వే శాఖ భారీ నష్టం నుంచి బయటపడిందనీ అన్నారు. ట్రాక్‌ మెన్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. కాగా, పర్యాటకులు ఈ మార్గం గుండానే అరకులోయ అందాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. 58 సొరంగాలు, 84 వంతెనల గుండా దాదాపు 3 గంటల పాటు సాగే కేకే రైల్వే లైన్‌ రైలు ప్రయాణమంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి సొంతమవ్వాల్సిందే..! 

గతంలో రైల్వేకు భారీ నష్టం..
విశాఖలోని ఉక్కు పరిశ్రమకు ఈ మార్గం గుండానే ఇనుప ఖనిజం సరఫరా అవుతుంది. గతేడాది వర్షాల కారణంగా కేకే రైలు మార్గం దెబ్బతినగా.. లైను పునరు​ద్ధరణకు రెండు నెలలు పట్టింది. ముడి ఖనిజం రవాణా నిలిచి పోవడంతో రైల్వేకు దాదాపు 300 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

మరిన్ని వార్తలు