ఆది నుంచి వివాదాలే!

17 Sep, 2019 05:46 IST|Sakshi

నరసరావుపేటలో మొదలై సత్తెనపల్లిలో ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం 

నాడు వంగవీటి రంగా దారుణ హత్యతో హోంమంత్రి పదవికి రాజీనామా

సాక్షి, గుంటూరు: టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2వ తేదీన సంజీవయ్య, లక్మీనర్సమ్మ దంపతులకు జన్మించారు. కోడెల భార్య శశికళ గృహిణి. వీరికి విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ సంతానం. కోడెల తోబుట్టువులు చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోవడం డాక్టర్‌ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. కోడెల ప్రముఖ వైద్యుడిగా నరసరావుపేట ప్రాంతంలో పేరుపొందారు. 1983లో ఎన్టీఆర్‌ పిలుపుతో టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచి వివాదాలతోనే సాగింది.1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరసరావుపేటలోని కోడెల నివాసంలో బాంబులు పేలి నలుగురు మృత్యువాత పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. కోడెల హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. ఈ కారణంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్థానికంగా ఆదరణ, పట్టు కోల్పోవడం, రెండు సార్లు ఓటమి పాలవడంతో 2014ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వెళ్లారు. అక్కడి నుంచి గెలుపొంది ఏపీ తొలి శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 

మరిన్ని వార్తలు