‘కే’ మాయ; ఇంతింత కాదయా!

23 Aug, 2019 13:54 IST|Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. శాసనసభలోని వస్తువులను గంపగుత్తగా సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన విద్యార్థుల కంప్యూటర్లనూ వదల్లేదని తాజాగా వెల్లడైంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో ఈ డ్రామా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కంప్యూటర్లను ఇంట్లో పెట్టుకుని సొంతానికి వాడుకున్నట్టు తేలింది.

అసలు కథ ఇదీ...
కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు కోడెల. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు.

ఈ రోజు ఉదయం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి అప్పుడు పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పారు. ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని అర్ధమైంది. అసెంబ్లీ ఫర్నీచర్‌నే కాదు విద్యార్థుల కంప్యూటర్లను సొంతానికి వాడుకున్న కోడెలపై స్థానికులు మండిపడుతున్నారు. (చదవండి: ‘కే’ మాయ)

>
మరిన్ని వార్తలు