వైఎస్సార్సీపీ మహిళా యువనేత శ్రావణి
విజయనగరం మున్సిపాలిటీ: మహిళలను అన్ని విధాలా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, రానున్న ఎన్నికల్లో మహిళలంతా తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె, మహిళా యువనేత కోలగట్ల శ్రావణి అన్నారు. ఆదివారం పట్టణంలోని 28 వార్డులో జరిగిన మహిళా సమావేశంలో ఆమె మాట్లాడారు. మోసపూరిత హామీలతో నయవంచనకు గురిచేసిన చంద్రబాబును ప్రతి మహిళా ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తానని 2014 ఎన్నికల్లో మహిళల చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన చంద్రదాబు తర్వాత రుణ మాఫీ చేయకపోవడంతో వడ్డీలు కట్టలేక మహిళలు ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికలలో మళ్లీ మహిళలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ చేసి ఇప్పుడు అమలు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. 2019లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునే ఎందుకు చంద్రబాబు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మహిళలు చంద్రబాబు వలలో పడి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో బోనాల ధనలక్ష్మి, డెంకాడ పద్మావతి, రామలక్ష్మి, నాగమణి, బొట్ట శ్రావ్య, మారం జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.