-

ఆదోనిలో ‘కోయంబేడు’ కలకలం

16 May, 2020 11:57 IST|Sakshi
మహాత్మాగాంధీ నగర్‌లో బారికేడ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఐ లక్ష్మయ్య, అసిస్టెంట్‌ కమిషనర్‌ షమీ

ఆదోని: చెన్నై కోయంబేడు మార్కెట్‌ వెళ్లి వచ్చిన వారు ఆదోనిలో ఉండటంతో కలకలం రేగింది. వ్యవసాయ ఉత్పత్తులను లారీల్లో కోయంబేడు మార్కెట్‌కు తీసుకెళ్లి తిరిగి వచ్చిన డ్రైవర్లలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా అధికారులు శుక్రవారం నిర్ధారించారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారు మహాత్మాగాంధీనగర్, రాజరాజేశ్వరినగర్, ఖాజీపురకు చెందిన వారు కావడంతో పోలీసులు ఆ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రోడ్లకు అన్ని వైపుల బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు చంద్రశేఖర్, లక్ష్మయ్య సూచించారు.   
డోన్‌:  కోయంబేడు మార్కెట్‌కు ఉల్లిని తరలించి విక్రయించిన డోన్‌ నియోజకవర్గానికి చెందిన రైతులు, లారీల డ్రైవర్లు 9 మందిని గుర్తించి కర్నూలు క్వారంటైన్‌కు తరలించినట్లు ఇన్సిడెంట్‌ కమాండెంట్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. 

వెల్దుర్తి/కృష్ణగిరి: కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చి, కరోనా పాజిటివ్‌ వచ్చిన అనంతపురానికి చెందిన వాహనదారులతో కాంటాక్ట్‌ అయిన మండలానికి చెందిన ఆరుగురిని కర్నూలు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్లు తహసీల్దార్‌ రజనీకుమారి, ఎంపీడీఓ సుబ్బారెడ్డి,  తెలిపారు. మరో ఇద్దరికి డోన్‌ క్వారంటైన్‌లో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించి, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచినట్లు  వెల్లడించారు.  అలాగే కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన కృష్ణగిరి మండలానికి చెందిన మరో  ఐదుగురిని కూడా  క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు