బెజవాడ కృష్ణలంకలో బంద్

30 Mar, 2020 10:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిన కారణంగా విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో సోమవారం బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. కృష్ణలంకలో ఉన్న 16, 17, 18, 20, 21, 22 డివిజన్లలో పూర్తిగా బంద్ పాటించాలని, ఇళ్లలో నుంచి జనాలు బయటకు రావద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. అత్యవసరం అయితే మాస్క్‌లు, శానిటైజర్లతో బయటకు రావాలని ఆయన సూచించారు.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. (కరోనా 'లాక్డౌన్'పై సీరియస్నెస్ ఏదీ?)

రాణిగారితోటలో హైఅలర్ట్‌
స్థానిక కృష్ణలంక రాణిగారితోటలో శనివారం 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ అవ్వటంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం హైఅలర్ట్‌గా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు ఆదివారం చుట్టుపక్కల రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య సిబ్బంది కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయా వీధుల్లో హైడ్రోక్లోరైడ్‌ క్రీమిసంహారక మందులు, బ్లీచింగ్‌ చల్లించారు. ప్రజలు రోడ్లమీద తిరుగకుండా పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. (.11 గంటల తర్వాత బయటకు రావద్దు)

మరిన్ని వార్తలు