ఉద్యమాలే ఊపిరి

29 Dec, 2013 03:28 IST|Sakshi
krisnaiah

 మా సొంతూరు మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి. నాన్న ర్యాగ అడివప్ప, అమ్మ రాములమ్మ. మాది పెద్ద జమీందారీ కుటుంబం. దాంతో చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెరిగా. బాల్యం మొత్తం ఎంతో వైభవంగా గడిచింది. మా ఊర్లో బడి లేకపోవడంతో ప్రత్యేకంగా టీచర్లు నియమించి చదువు చెప్పించారు. నాలుగోతరగతి వరకు ఇంటివద్దే సాగింది. ఆ తర్వాత పక్క ఊరు అనంతసాగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో, అక్కణ్నుంచి టేకులపల్లి యూపీ స్కూల్, మోమిన్‌పేట ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్నా. సంగారెడ్డి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశా. వికారాబాద్ ఎస్‌ఏపీ కాలేజీలో డిగ్రీ చదివా. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఫిల్ పూర్తిచేశా.
 బడి ఎగ్గొట్టి ఆటలాడేవాడిని
 నేను మొదట్నుంచీ టాప్ స్టూడెంట్‌నే. ఆటపాటలతో పాటు చదువుల్లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపేవాడిని. క్లాస్ రూంలో నేను వేసే ప్రశ్నలకు టీచర్లు సమాధానం చెప్పలేక తల పట్టుకునేవారు. బడికి డుమ్మా కొడితే టీచర్లు ప్రశాంతంగా ఉండేవాళ్లంట. స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లే వాడిని కాదు. ఇంట్లో మాత్రం బడికి వెళ్తున్నాని చెప్పి.. దోస్తులతో పొలాలకు వెళ్లేవాడిని. అక్కడే పొలం పనులతో పాటు ఆటపాటల్లో మునిగిపోయేవాడిని. తిరిగి సాయంత్రం ఇంటికి చేరేవాడిని. స్కూల్లో నా హాజరు శాతం 40కి మించేది కాదు. అలా డుమ్మాలు కొట్టినప్పటికీ పరీక్షల్లో మాత్రం క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. టెన్త్, ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు నాది. డిగ్రీలో కాలేజీ టాపర్‌నే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించా. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలో యూనివర్సిటీ ఫస్టొచ్చా.
 ‘సర్దార్ పటేల్’ అని పిలిచేవారు
 చిన్నప్పటి నుంచీ ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడం నాకు అలవాటు. ఎవర్నైనా ఎదిరించే మనస్తత్వం అలవడింది. దీంతో మా నారాయణ మాస్టారు నాకు సర్దార్ వల్లభాయ్‌పటేల్ అని పేరు పెట్టారు. బడిలో అందరూ అలాగే పిలిచేవాళ్లు. నా చురుకుదనం చూసి బడిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది నన్ను బాగా అభిమానించేవారు. ఏదైనా శుభకార్యానికి మావాళ్లను పిలిచినప్పుడు నన్నూ వెంట తీసుకుని రమ్మనేవారు. నన్ను ఇతర పిల్లలకు పరిచయం చేస్తుంటే చాలా ఆనందం కలిగేది.
 చదువుకోసం అమ్మ నగల్ని అమ్మేశా
 నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ తర్వాత పదోతరగతిలో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మా, నాన్న  నా చిన్నతనంలో చనిపోవడం తీవ్రంగా కలచివేసింది. వాళ్ల మరణంతో నాకు కష్టాలు మొదలయ్యాయి. చిన్నమ్మలు, అన్నయ్యలు సరిగ్గా చూసుకునే వారు కాదు. దీంతో వసతిగృహంలో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. ఫీజు పరిస్థితి లేకపోవడంతో అమ్మ బంగారు నగలు అమ్మి డబ్బులు కట్టాల్సి వచ్చింది.
 అలా మొదలైంది..
 సంగారెడ్డిలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సంక్షేమ వసతిగృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లేవాడిని. హాస్టల్లో సమస్యలపై మొదటిసారిగా విద్యార్థులతో కలిసి ఉన్నతాధికారుల వద్ద ఆందోళన చేశాం. ఆ తర్వాత మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టా. ఆ సమయంలో కలెక్టర్ సరిగ్గా స్పందించకపోవడంతో నేరుగా ఆయనతో గొడవకు దిగా. ఆ క్షణంలో నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. పెద్ద గొడవే జరిగింది. తర్వాత సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అలా ఉద్యమాల బాట పట్టాను. ఆ తర్వాత ఎస్‌ఏపీ కాలేజీలో డిగ్రీలో ఉన్నప్పుడు వికారాబాద్‌లోని సంక్షేమ వసతిగృహంలో సమస్యలపై ఆందోళన చేపట్టాం. దాదాపు మూడోందల మందితో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాం. అధికారులను గదిలో పెట్టి తాళాలు వేయడంతో హాస్టళ్లను మూసేశారు. డైట్ చార్జీలు నిలిపివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అప్పట్నుంచి సమస్యలపై ఆందోళనలు తీవ్రతరం చేశాం.
 ఉద్యోగానికి రాజీనామా చేసి..
 ఉద్యమంలోకి
 బీకాం పూర్తి చేసిన తర్వాత బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేశా. కాల్‌లెటర్ వచ్చిన తర్వాత వెంటనే జాయినయ్యా. కానీ రెండ్రోజులు పనిచేసిన తర్వాత ఏదో లోటుగా అ నిపించింది. నేను చేయాల్సి పని ఇది కాదు.. సమాజానికి నేరుగా ఉపయోగపడే పని చేయాలనిపించింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఉద్యమ బాట పట్టా.
 జాతీయ మీడియాలో హల్‌చల్..
 ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ సంక్షేమానికి ప్రత్యేకించి శాఖలేదు. వారికి కూడా ప్రత్యేక వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించాం. దీంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాం. 1978లో అనుకుంటా... ఆగస్ట్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీసీ హాస్టళ్లు కోసం దాదాపు రెండువేల మందితో అసెంబ్లీని ముట్టడించాం. బ్యాగుల్లో రాళ్లతో వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసులు ముట్టడిని అడ్డుకోవడంతో విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో చాలా పెద్ద గొడవ జరిగింది. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో మా ఉద్యమానికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం కూడా స్పందించింది.
 ముందుండి నడిపించా..
 విద్యార్థుల సమస్యలపై జరిగిన ఉద్యమాలన్నీ ఉస్మానియా యూనివర్సిటీనుంచి మొదలయ్యేవి. వాటికి యూనివర్సిటీలోని సంఘాల నేతలు నాయకత్వం వహించేవారు. యూనివర్సిటీలోన్ని అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణగా ఏర్పాటైతే, వాటన్నింటికీ నేను చైర్మన్‌గా వ్యవహరించేవాడిని. 1970 నుంచి 94వరకు అన్ని ఉద్యమ కమిటీలను నేనే ముందుండి నడిపించా. ఆ ఉద్యమాల ఫలితంగానే 1983లో రాష్ట్రవ్యాప్తంగా 44 ఆశ్రమ పాఠశాలలు మంజూరయ్యాయి. అప్పట్నుంచి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 40 ఆశ్రమ పాఠశాలలు ప్రాధాన్యతను బట్టి ప్రారంభిస్తూ వచ్చింది. చాలా సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి.
 ఆ క్షణాన్ని మర్చిపోలేను..
 విద్యార్థులకు ఉన్నత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నత విద్య ఉండటాన్ని గుర్తించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఉద్యమం చేపట్టా. మొత్తానికి అనుకున్నది సాధించా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రకటించారు. అప్పుడు లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు కనిపించింది. ఆ క్షణాన్ని అస్సలు మర్చిపోలేను. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని  ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవనెత్తా. అది కూడా సాకారమైంది.
 రాజకీయాల్లోకి రాను..
 ప్రస్తుత రాజకీయాలన్నీ డబ్బుమయమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు టికెట్లను సినిమా టిక్కెట్ల మాదిరిగా డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి వచ్చేవారు. నిజాయతీగా పనిచేసేవారు. ఇప్పటి నేతల్లో ఆ అంశాలు మచ్చుకు కూడా కనిపించడంలేదు. నాకు రాజకీయాలంటే నచ్చదు. చాలా రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తామని చెప్పినా నేను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేయలేని పనులు నేను ఉద్యమం చేసి సాధించా. ఇంతకంటే ఏం కావాలి.. చివరివర కూ ప్రజా సమస్యలపైనే ఉద్యమిస్తా.
 తీరిక దొరకక..
 అప్పట్లో తీరిక సమయంలో సినిమాలు చూసేవాడిని. అల్లూరి సీతారామరాజు నా ఫేవరెట్ సినిమా. బొబ్బిలి పులి, దానవీర శూరకర్ణ సినిమాలు కూడా నచ్చాయి. పుస్తకాలు చదవడం ఇష్టమే. కానీ తీరిక లేక చదవలేకపోతున్నా. రోజుకు కనిష్టంగా రెండొందల మందిని కలుస్తా. వారి సమస్యలు ఆలకిస్తా. భార్య శబరిదేవి, గ్రూప్-1 అధికారిణి. కుమారుడు రుషి అరుణ్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కూతురు శ్వేతాదేవి. ప్రతిరోజు గంటపాటు యోగా చేస్తా.
 చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు..
  చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలనేది నా కల. దీంతో బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. త్వరలోనే బీసీ రిజర్వేషన్లు అమలవుతాయనే నమ్మకం ఉంది.
 యువత సంకల్పబలంతో ముందుకెళ్లాలి
 యువతపైనే దేశ అభివృద్ధి ఆధారపడిఉంది. యువతలో దేశభక్తిని, శ్రమ సంస్కృతిని పెంపొందించుకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యానికి సంకల్పబలం తోడైతే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి.

మరిన్ని వార్తలు