అమ్మో!... ఆయనకు టిక్కెట్టు రాకపోతేనా!?

7 Mar, 2014 02:59 IST|Sakshi


- ఇదీ కేంద్ర మంత్రి కృపారాణి ఆందోళన
 కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంట పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ టిక్కెట్టు ఆమెకే దక్కనుంది. కానీ కృపారాణి అంతటితో సంతృప్తి చెందలేకపోతున్నారు. టెక్కలి ఎమ్మెల్యే టిక్కెట్టు తన భర్త రామ్మోహనరావుకే ఇప్పించుకోవడం ఆమెకు సవాల్‌గా పరిణమించింది. ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం టిక్కెట్లు ఖరారు చేస్తామని రాహుల్‌గాంధీ చెబుతుండటమే ఇందుకు కారణం. దానికితోడు ఒకే ఇంటికి రెండు టిక్కెట్లు ఇవ్వకూడదని రాహుల్ భావిస్తున్నారన్న సమాచారం కృపారాణిని కలవరపరుస్తోంది. ఎందుకంటే రామ్మోహన్‌రావు వ్యవహారం శైలి గత కొన్నేళ్లుగా తీవ్ర వివాదాస్పదమైంది.
 
  నియోజకవర్గంలోని అధికారులను ఆయన వేధిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఆయన వేధింపులను తాళలేక పలువురు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఇక ఇతరాత్రా వ్యవహా రాల్లో కూడా రామ్మోహన్‌రావు తీవ్ర వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. ఇక కాలేజీలోనూ, బయటా దుందుడుకు చర్యలు, సహచర విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడ్డ కుమారుడిని రామ్మోహన్‌రావు వెనకేసుకువచ్చిన తీరు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌రావుకు టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంపై సందేహాలు ముసురుకున్నాయి.
 
  రామ్మోహన్‌రావు టిక్కెట్టు కోసం అధిష్టానం వద్ద కృపారాణి చేసిన ప్రయత్నాలకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. వేరే అభ్యర్థిని సూచించమని అధిష్టానం ప్రతినిధులు సూచించడంతో ఆమెలో కలవరం మొదలైంది. టిక్కెట్టు రాకపోతే రామ్మోహన్‌నరావు ఎలా స్పందిస్తారోనని ఆమె ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఎలాగైనాసరే ఆయనకు టిక్కెట్టు వచ్చేలా చేయడం కోసం కృపారాణి ప్రయత్నాలు ముమ్మ రం చేశారు.
 
   ఇలా.. టిక్కెట్ రాజకీయాలు ఇటు గుండ కుటుంబంలోను, అటు కిల్లి కుటుంబంలోనూ అలజడి సృష్టిస్తున్నాయి. అదండీ సంగతి.
 

>
మరిన్ని వార్తలు