తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..

3 Jul, 2015 19:15 IST|Sakshi

ఏలూరు (వన్ టౌన్) : చనిపోయిన తండ్రికి ఓ కూతురు తలకొరివి పెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సుబ్బమ్మదేవి పాఠశాల సమీపంలోని పాములదిబ్బ కాలనీకి చెందిన కుందిరి రాము అనే అరటిపళ్ల వ్యాపారి శుక్రవారం మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. కొంతకాలం నుంచి రాము అనారోగ్యం బారినపడి మంచం పట్టడంతో ఇంటర్మీడియెట్ వరకు చదివిన పెద్దకుమార్తె లక్ష్మి ఒక షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

రాము రెండో కుమార్తె ఈశ్వరి పదో తరగతి చదువుతోంది. చిరు వ్యాపారి మృతి చెందగా, తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంటానంటూ చిన్న కుమార్తె ఈశ్వరి ముందుకొచ్చింది. పెద్దలు ఆమెతోనే తలకొరివి పెట్టించారు. చిన్నపిల్ల, చదువుకునే పిల్ల అయినా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుందని స్థానికులు ఈశ్వరిని అభినందించారు.

మరిన్ని వార్తలు