మరిచారా బాబూ.. మీరే మా ఎమ్మెల్యే!

25 Apr, 2020 07:37 IST|Sakshi

30 ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్న కుప్పం వాసులు

కష్టకాలంలో నియోజకవర్గాన్ని పట్టించుకోని బాబు

అధినేత బాటలోనే ఆ పార్టీ స్థానిక నేతలు

ప్రభుత్వ సాయంతో కుప్పం వాసులకు ఊరట

సాక్షి, తిరుపతి:  ముప్పై ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్న కుప్పం వాసుల యోగ క్షేమాలు మరచి చంద్రబాబు హైదరాబాద్‌లో తన నివాసానికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదు. దేశమంతా ఎమ్మెల్యేలు తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటు లో ఉంటూ సొంత డబ్బుతో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలతోపాటు విటమిన్‌ టాబ్లెట్లను పంపిణీ చేçస్తున్నారు. కుప్పం ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తనను గెలిపించిన కుప్పం, రాష్ట్రంతో సంబంధం లేనట్టు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన రాలేని పరిస్థితుల్లో స్థానిక నాయకులకు చెప్పి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉన్నా... ఆ దిశగా ప్రయత్నించలేదని కుప్పం వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుల, మత, పార్టీలకతీతంగా రూ.వెయ్యి పంపిణీతో పాటు ఉచితంగా రేషన్‌ అందించి ఆదుకుంటోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు, దాతలు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు అందించి, పేదల ఆకలి తీరుస్తుండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు ప్రజలకు ఏ విధంగాను సాయం చేసిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అమరనాథ్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని నమ్ముకున్న వారిని కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.

బాబు మమ్మల్ని పట్టించుకోలేదు
లాక్‌డౌన్‌తో నెలరోజులకు పైగా అంతా ఇళ్ల వద్దే ఉంటున్నాం. పనులు పోయాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయనున్న ముప్పై ఏళ్లుగా ఎన్నుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో చంద్రబాబు పట్టించుకోకపోవడం బాధగా ఉంది. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం.– ముత్తురాజ్, మోడ్రన్‌ కాలనీ, కుప్పం

ప్రభుత్వమే సాయం చేస్తోంది
ప్రభుత్వం రేషన్‌ కార్డుకు అదనంగా రూ.వెయ్యి ఇస్తోంది. పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ నేతలు పేదలకు బియ్యం, పప్పు, ఉప్పు, కాయకూరలు అందజేస్తు్తన్నారు. ముప్పై ఏళ్లుగా ఓటేసి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నా మమ్మల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం అన్యాయం. – అరుణ్, డీకేపల్లె, కుప్పం మండలం

చంద్రబాబు కనిపించలేదని ఫిర్యాదు
కుప్పం: స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడి ఆచూకీ తెలిపాలని కుప్పం ముస్లిం మైనారిటీ అసోసియేషన్‌ అధ్యక్షు డు ఫైరోజ్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సల హాలు, సూచనలు కుప్పం ప్రాంతానికి ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఆయన కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లేదన్నారు. చంద్రబాబును వెతికి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కుప్పం ప్రజలను ఆదుకునేలా చూడాలని కోరారు. 

మరిన్ని వార్తలు