‘ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుంది’

26 May, 2020 21:52 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉండి వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరను ఇప్పించేందుకు కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన పోగాకు రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పొగాకు వ్యాపారులు, ట్రేడర్లతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పొగాకు సాగు వచ్చే ఏడాది నుంచి తగ్గించేలా అందరూ సహకరించాలన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ట్రేడర్లు, వ్యాపారులు పోటీతత్వంతో మార్కెట్‌లో పాల్గొనాలని చెప్పారు.

వచ్చే ఏడాది నుంచి పొగాకు సాగుకు బదులుగా ప్రత్యాన్మయ పంటల సాగు చేసేందుకు ప్రయత్నం చేయాలని రైతులను కోరుతున్నామన్నారు. దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించి రాయితీలను అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. బ్రైట్ గ్రేడ్‌తో పాటు మీడియం, లోయర్ గ్రేడ్ ఉత్పత్తులను కూడా రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు